
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నారా చంద్రబాబునాయుడు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం రాజమండ్రిలో ప్రారంభమైన టీడీపీ మహానాడులో పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించారు.
చంద్రబాబు నాయుడుకు మద్దతుగా 11 నామినేషన్లు వచ్చాయి. పోటీలో మరెవరూ లేకపోవడంతో మరోసారి చంద్రబాబుకే పార్టీ జాతీయ పగ్గాలు అప్పగించారు. అంతేకాదు, కమిటీల ఏర్పాటుపై సర్వాధికారాలు చంద్రబాబుకే అప్పగించారు. అనంతరం చంద్రబాబు టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు.
మహానాడును ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ, పేదవాళ్ల కష్టాలు ఎలా ఉంటాయో తనకు తెలుసని, తాను కూడా పేద కుటుంబం నుంచే వచ్చానని వెల్లడించారు. తెలుగు జాతి కోసమే పనిచేస్తున్నానని పునరుద్ఘాటించారు. ప్రధానమంత్రిగా చేసే అవకాశం వచ్చినా సున్నితంగా తిరస్కరించానని తెలిపారు. నా జీవితం తెలుగు జాతికే అంకితం అని స్పష్టం చేశానని పేర్కొన్నారు.