
ఇండియా,రష్యా బంధం మరింత బలోపేతం..
హైదరాబాద్ డిసెంబరు 5, 2025
రష్యా అధ్యక్షుడు పుతిన్ తో శిఖరాగ్ర సమావేశం తర్వాత ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. రష్యన్ పౌరులకు త్వరలో ఫ్రీ టూరిస్టు వీసా ఇస్తామన్నారు. 30 రోజులపాటు రష్యన్ పౌరులు భారత్ లో పర్యటించవచ్చన్నారు.. టూరిస్టు ప్రాంతాలను చూడొచ్చన్నారు. భారత్, రష్యా బలమైన పీపుల్ టు పీపుల్ రిలేషన్ షిప్ పంచుకుంటున్నాయన్నారు. ఈ నిర్ణయంతో రెండు దేశాల మధ్య పర్యాటకం, సాంస్కృతిక బంధాలను బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
రష్యన్ పౌరులకు ఈ-టూరిస్ట్ వీసాలు ,గ్రూప్ టూరిస్ట్ వీసాలు రెండూ త్వరలో ప్రారంభించబడతాయని, ప్రాసెసింగ్ ఫీజు లేకుండానే వీటిని ప్రారంభించనున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. వాణిజ్యం, పెట్టుబడి ,సాంకేతిక పరిజ్ఞానం, రెండు దేశాల ఆర్థిక వ్యవస్థల బలోపేతం, సహకారాన్ని పెంపొందించేందుకు రూపొందించిన విజన్ 2030 రోడ్మ్యాప్ ని ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన ఆవిష్కరించారు.
విశ్వాసం, నమ్మకం ఆధారంగా రెండు దేశాల మధ్య బంధం కొనసాగుతోందన్నారు. మేకిన్ ఇండియా సాకారంలో రష్యా సహకారం ఎంతో కీలకం అన్నారు. యూరియా ఉత్పత్తిలో రష్యాతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. స్వేఛ్చా వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతాయన్నారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో భారత్ శాంతి పక్షానే ఉంటుందన్న మోదీ.. ఉగ్రవాదంపై పోరాటంలో రష్యా సహకారం మరువలేనిదన్నారు.
