
హైదరాబాద్:
తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రశంసనీయమని, భక్తులకు అత్యాధునిక సేవలు అందించడంలో టీటీడీ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని నమో వందే గో మాతరం వ్యవస్థాపక అధ్యక్షుడు పెరిక సురేష్ పేర్కొన్నారు. తిరుమలలో భక్తులకు మెరుగైన సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడాన్ని స్వాగతిస్తూ ఏపీ సీఎం చంద్రబాబును కలిసి అభినందనలు తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలో భక్తుల సంక్షేమం, ఆధునిక సాంకేతికత వినియోగం, పారదర్శక పరిపాలనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుండటంతో తిరుమల మరింత అభివృద్ధి చెందుతోందని ఆయన అన్నారు. ఇదే సేవాస్ఫూర్తితో ముందుకు సాగి, తిరుమలను ప్రపంచంలోనే అత్యుత్తమ ఆధ్యాత్మిక క్షేత్రంగా మరింత తీర్చిదిద్దాలని పెరిక సురేష్ ఆకాంక్షించారు.

రద్దీనీ కంట్రోల్ చేస్తున్న ఏఐ సేవలు
తిరుమలలోఆర్టీఫిషియల్ ఇంటెలీజెన్స్ ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి భక్తుల రద్దీని సమర్థంగా నిర్వహించడం, వేచి ఉండే సమయాన్ని తగ్గించడం గొప్ప ముందడుగని అన్నారు. అలాగే అచ్యుతం, శ్రీపథం వంటి భారీ వసతి సముదాయాల నిర్మాణం, లగేజ్, మొబైల్ డిపాజిట్ కేంద్రాల్లో డిజిటల్ ట్రాకింగ్ వ్యవస్థ, ఫేషియల్ రికగ్నిషన్తో కూడిన సేవలు, పర్యావరణహిత ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశం వంటి చర్యలు భక్తులకు మరింత సౌకర్యాన్ని కల్పిస్తున్నాయని తెలిపారు.
శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ ద్వారా ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులకు ఉచిత భోజనం అందించడం, కళ్యాణకట్ట సేవల విస్తరణ, ఎన్ఆర్ఐ భక్తులకు సుపథం దర్శన గడువును 90 రోజులకు పెంచడం వంటి నిర్ణయాలు టీటీడీ సేవాభావానికి నిదర్శనమని సురేష్ కొనియాడారు.

పెరిగిన శ్రీవారి హుండీ ఆదాయం
శ్రీవారి హుండీ ఆదాయం ప్రతి ఏడాది కొత్త రికార్డులు నమోదు చేయడం భక్తుల అపార విశ్వాసానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. 2024–25లో హుండీ ఆదాయం ₹1,365 కోట్లకు చేరగా, 2025–26లో అది ₹1,729 కోట్లకు పెరిగిందని, 2026–27 బడ్జెట్లో సుమారు ₹1,880 కోట్ల ఆదాయం అంచనా వేయడం తిరుమలపై భక్తుల విశ్వాసం మరింత బలపడుతున్న సంకేతమని అన్నారు.
