
ఆరోగ్యశ్రీ పరిమితి రూ.2 లక్షల నుండి 5 లక్షలకు పెంపు
హైదరాబాద్, జులై 19:
తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ పరిమితి రూ.2లక్షల నుండి 5లక్షలకు పెంచుతూ వైద్యారోగ్య శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో లబ్దిదారులకు కొత్త ఆరోగ్య శ్రీ డిజిటల్ కార్డులను అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో లబ్ధిదారులకు కొత్త డిజిటల్ కార్డులను అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. వీటిని స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా జిల్లాల్లోని లబ్ధిదారులకు అందించనుంది. ఆరోగ్యశ్రీ రోగులకు ఫేస్ రికగ్నిషన్ (ముఖాన్ని గుర్తించే) సాఫ్ట్వేర్ వినియోగానికి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అనుమతించింది. మంగళవారం హైదరాబాద్లోని ఆరోగ్యశ్రీ హెల్త్కేర్ ట్రస్ట్ కార్యాలయంలో రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్రావు ఆధ్వర్యంలో బోర్డు సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి హరీష్రావు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీలో బయోమెట్రిక్ విధానం వల్ల కొంత ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ప్రజలకు మరింత పారదర్శకంగా సేవలందించేందుకు ఫేస్ రికగ్నిషన్ విధానం అమలులోకి తేవాలన్నారు. కొత్త కార్డులను అందించేందుకు లబ్ధిదారుల కేవైసీ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్నారు. నిమ్స్ స్పెషలిస్ట్ వైద్యుల ద్వారా ఆరోగ్యశ్రీ కేసుల మెడికల్ ఆడిట్ నిర్వహించాలని సూచించారు. రాష్ట్రంలో డయాలసిస్ సేవలు మరింత మెరుగ్గా అందించేందుకు ఆన్లైన్లో పర్యవేక్షించేలా ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించి, వినియోగించేందుకు బోర్డు అనుమతించింది.
ఈ బోర్డు సమావేశంలో వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓ విశాలాచ్చి, సీఎం ఓఎస్డీ గంగాధర్, డీఎంఈ రమేశ్రెడ్డి, ప్రజారోగ్యశాఖ సంచాలకులు జి.శ్రీనివాసరావు, వైద్యవిధానపరిషత్ కమిషనర్ అజయ్కుమార్, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప హాజరయ్యారు.
