
హైదరాబాద్, జులై 28: ఆగస్టు నెల 3 వ తేదీ నుంచి రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు శుక్రవారం సర్క్యూలర్ జారీ చేశారు.



ఈ నెలాఖరులో రాష్ట్ర కేబినెట్
ఈనెలాఖరులో తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. ఈనెల జులై 31 తేదీ సోమవారం నాడు మధ్యాహ్నాం 2 గంటల నుంచి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర కేబినేట్ సమావేశాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ సందర్భంగా దాదాపు 40 నుంచి 50 అంశాల మీద రాష్ట్ర కేబినేట్ చర్చించనున్నది. ఇందులో భాగంగా భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో సంభవించిన వరదలు, ప్రభుత్వ చర్యలపై కేబినేట్ సమీక్షించనున్నది.


రాష్ట్రంలో రైతాంగం వ్యవసాయ సాగు పనులు కొనసాగుతున్న నేపథ్యంలోఅకాల వర్షాల వల్ల రాష్ట్ర వ్యవసాయ రంగంలో తలెత్తిన పరిస్థితులను అంచనా వేస్తూ అనుసరించాల్సిన ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలపై కేబినేట్ చర్చించనున్నది. రాష్ట్రంలో ఉధృతంగా కురిసిన వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగిపొర్లి రోడ్లు తెగిపోవడం, రవాణా మార్గాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయనున్నది. అందుకు యుద్ధప్రాతిపదికన రోడ్లను తిరిగి పునరుద్ధిరించడం కోసం చేపట్టనున్న చర్యలపై కేబినేట్ చర్చించనున్నది.
అదే సందర్భంలో..ఆర్టీసీ సంస్థకు సంబంధించిన అంశాలపై కేబినేట్ చర్చించనున్నది. ఆర్టీసీ ఉద్యోగులకు జీతభత్యాల పెంపు తదితర అంశాలపై చర్చించి కేబినేట్ తగు నిర్ణయం తీసుకోనున్నది.