
రికార్డు స్థాయిలో రైతు బీమా
బీమా లబ్ది దారుల్లో టాప్ లో నల్గొండ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 2025-26 రైతు బీమా ఇన్సూరెన్స్ ఇయర్లో రికార్డు స్థాయిలో 42,16,848 మంది రైతులకు బీమా సౌకర్యం కల్పించినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. గత ఏడాది కంటే 1,181 మంది అదనంగా చేరడంతో రాష్ట్ర చరిత్రలో ఇది అత్యధిక సంఖ్యగా నిలిచింది.
నల్గొండ జిల్లా టాప్లో
రైతు బీమా లబ్ధిదారుల సంఖ్యలో నల్గొండ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 2,98,037 మంది రైతులకు బీమా కల్పించారు. వీరిలో 12,212 మంది కొత్తగా చేరగా, 2,85,825 మంది రైతుల బీమాను రెన్యూవల్ చేశారు. రెండో స్థానంలో సంగారెడ్డి జిల్లా (2,12,335 మంది), మూడో స్థానంలో ఖమ్మం జిల్లా (2,04,951 మంది) నిలిచాయి. కామారెడ్డి జిల్లాలో 1,98,241 మందికి, నాగర్కర్నూల్ జిల్లాలో 1,90,945 మందికి బీమా సౌకర్యం కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా 24 జిల్లాల్లో లక్షకు పైగా రైతులకు బీమా అందగా, మిగతా 8 జిల్లాల్లో లక్షలోపు లబ్ధిదారులు ఉన్నారు. మేడ్చల్ జిల్లా అత్యల్పంగా 14,310 మంది రైతులతో, కొత్తగా 632 మందితో చివరి స్థానంలో నిలిచింది.
కొత్తగా 1.96 లక్షల మందికి అవకాశం
2025-26 బీమా సంవత్సరానికి ఆగస్టు 14 నుంచి కొత్త సీజన్ ప్రారంభమైంది. జూన్ 5, 2025 వరకు పట్టాదారు పాస్బుక్లు పొందిన 18-59 ఏళ్ల రైతులు ఈ పథకానికి అర్హులు. ఆగస్టు 13 వరకు స్వీకరించిన దరఖాస్తుల ఆధారంగా 1,96,890 మంది కొత్త రైతులకు బీమా కల్పించారు. అలాగే, గతంలో బీమా కలిగిన 40,19,958 మంది రైతుల బీమాను రెన్యూవల్ చేశారు. ఈ బీమా 2026 ఆగస్టు 14 వరకు కొనసాగనుంది.
ప్రీమియం తగ్గింపు
ఈ ఏడాది రైతులకు మరింత సౌలభ్యం కల్పించేందుకు బీమా ప్రీమియం రూ.3,400 నుంచి రూ.3,225కు తగ్గించారు, అంటే రూ.175 తగ్గింపు. వ్యవసాయ శాఖ అధికారుల చర్చలతో ఈ తగ్గింపు సాధ్యమైంది.
రూ.1,300 కోట్ల పరిహారం
2024-25 బీమా సంవత్సరంలో 25,000కు పైగా క్లెయిమ్లు నమోదయ్యాయి. ఒక్కో క్లెయిమ్కు రూ.5 లక్షల చొప్పున, మొత్తం రూ.1,300 కోట్లకు పైగా పరిహారం రైతు కుటుంబాలకు అందినట్లు అధికారులు తెలిపారు.
రైతు బీమా పథకం రైతులకు ఆర్థిక భద్రత, భరోసా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని మరింత విస్తరిస్తోందని అధికారులు పేర్కొన్నారు.
