
# ఇక ఇంటి నుండే యూరియా బుకింగ్
#పంపిణీ కోసం ప్రత్యేక మొబైల్ యాప్
#ఈ యాసంగి నుంచే అందుబాటులోకి తీసుకురానున్న వ్యవసాయశాఖ
- ఈ నెల 20 నుండి ప్రయోగాత్మక అమలు
హైదరాబాద్, డిసెంబర్ 15:
రైతులు యూరియా కోసం ఇంటి వద్ద నుంచే ముందుగానే బుక్ చేసుకునే సౌకర్యం కల్పించేందుకు వ్యవసాయశాఖ ప్రత్యేక మొబైల్ యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ నెల 20 నుంచి ఎరువుల మొబైల్ యాప్ ను ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించింది.
ఈ యాప్ ద్వారా రైతులు తమ సమీపంలోని ఎరువుల డీలర్ తో పాటు జిల్లా పరిధిలోని డీలర్ల వద్ద ఉన్న యూరియా స్టాక్ లభ్యతను తెలుసుకోవచ్చు. రైతు తన పంటలకు అవసరమైన యూరియాను ఏ డీలర్ వద్ద నుంచైనా ముందుగా బుక్ చేసి కొనుగోలు చేసుకునే అవకాశం ఈ యాప్ ద్వారా లభించనుంది. అవసరమైతే, యూరియా బుకింగ్ కోసం రైతులు తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈవో) సేవలను వినియోగించుకోవచ్చు.

యూరియా బుక్ చేసిన అనంతరం రైతుకు ఒక బుకింగ్ ఐడి వస్తుంది. ఆ బుకింగ్ ఐడి ఆధారంగా, రైతు ఎంపిక చేసిన డీలర్ వద్ద నుంచి యూరియాను కొనుగోలు చేయవచ్చు. డీలర్, రైతు, రైతు ప్రతినిధి వద్ద ఉన్న బుకింగ్ ఐడి, బుక్ చేసిన పరిమాణాన్ని ధృవీకరించిన తరువాతే యూరియాను విక్రయించాల్సి ఉంటుంది.
రైతులు బుకింగ్ సమయంలో రైతు తను వేసిన పంట పేరు, సాగు విస్తీర్ణం యాప్ లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ వివరాల ఆధారంగా రైతుకు అవసరమైన మొత్తం యూరియా పరిమాణాన్ని, ఎప్పుడెప్పుడు బుక్ చేసుకోవచ్చో యాప్ స్వయంగా లెక్కిస్తుంది. రైతులకు ఏవైనా సమస్యలు ఎదురైతే పరిష్కరించేందుకు హెల్ప్లైన్ నంబర్కు ఫిర్యాదు చేస్తే పరిష్కారం చేసేలా వ్యవస్థను వ్యవసాయశాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది.
యాప్ లోని ప్రత్యేకతలుః
- రైతులు, డిపార్ట్ మెంట్ , డీలర్ల కోసం వేర్వేరు లాగిన్లు
- మొబైల్ నెంబర్, ఒటిపి ద్వారా లాగిన్ అయ్యే అవకాశం
- లాగిన్ అవ్వగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని బస్తాల యూరియా అందుబాటులో ఉందో కనిపిస్తుంది
-యాప్లో లాగిన్ అయిన రైతులు తమ జిల్లాను ఎంపిక చేయగానే ఆ జిల్లాలో అందుబాటులో ఉన్న యూరియా వివరాలు కనిపిస్తాయి.
సీజన్ ను, రైతు పాస్ బుక్ నెంబర్, ఎన్ని ఎకరాలలో పంట వేస్తున్నారో, ఏఏ పంటను వేస్తున్నారో వివరాలు ఎంటర్ చేయాలి.
-రైతు సాగు చేసే ఎకరాలను బట్టి వారికి అవసరమయ్యే యూరియా బస్తాలు యాప్ లో కనిపిస్తాయి. సాగు చేసే విస్తీర్ణాన్ని బట్టి వారికి అవసరమయ్యే యూరియా బస్తాలను 15 రోజుల వ్యవధితో 1 నుంచి 4 దశలలో అందచేసేలా వివరాలు కనిపిస్తాయి.
-పట్టా పాస్ బుక్ లు లేని రైతులు వారి పట్టా పాస్ బుక్ దగ్గర ఆధార్ సెలెక్ట్ చేసుకొని, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, ఒటిపి కన్ఫర్మేషన్ తరువాత వివరాలను నింపాల్సి ఉంటుంది.
-కౌలు రైతులు వారి పేరు, తండ్రిపేరు, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, ఒటిపి కన్ఫార్మేషన్ తరువాత భూ యజమాని పట్టా పాస్ బుక్ నెంబర్ ఎంటర్ చేస్తే, భూయజమాని మొబైల్ నెంబర్ తో ఒటిపి వ్యాలిడేషన్ అయిన తరువాత కౌలు రైతులు తమ వివరాలు ఎంటర్ చేసేలా ఈ యాప్ లో అవకాశం కల్పించారు.
డీలర్లు వారి మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయి, వారు రోజువారిగా వారికి వచ్చిన స్టాక్, అమ్మకం వివరాలను నింపాల్సి ఉంటుంది.
