
రైతులకు అందిన సన్నవడ్ల బోనస్
ఒక్కరోజులోనే రూ.649.84కోట్లు విడుదల
ఇలా బోనస్ రూపంలో రూ.962.84కోట్లు
ఈయేడు ఇప్పటికే 59.74లక్షల టన్నులు
మొత్తం రూ.13833కోట్లు చెల్లింపులు
హైదరాబాద్, డిసెంబరు 19
ఈయేడు వానాకాలంలో సన్నవడ్లు సాగు చేసిన రైతులకు సర్కారు బోనస్ వెంట వెంటనే అందిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సన్నవడ్లు పండించిన రైతులకు క్వింటాల్కు రూ.500చొప్పున బోనస్ ను విడుదల చేసింది. శుక్రవారం ఒక్కరోజునే రూ. 649.84కోట్లు విడుదల చేసింది. దీంతో రాష్ట్ర రైతులకు బోనస్ రూపంలో ఇప్పటి వరకు రూ.962.84కోట్లు అందాయి. శుక్రవారం నాటికి రాష్ట్రంలో 11.45లక్షల మంది రైతులకు చెందిన 59.74లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయి.

సన్నాలు 30.35లక్షల టన్నులు
రాష్ట్ర సర్కారు సన్నవడ్లు సాగు చేసిన రైతులకు బోనస్ ప్రకటించిన నేపథ్యంలో ఈయేడు వానాకాలంలో సన్నాలు భారీగా సాగు జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు సెంటర్లకు29.39లక్షల టన్నుల టన్నుల దొడ్డు వడ్లు కొనుగోలు చేయగా, మరో 30.35లక్షల టన్నుల సన్న వడ్లు సర్కారు సివిల్ సప్లయ్స్ ద్వారా సేకరించింది. సన్నవడ్లకు సంబంధించి శుక్రవారం ఒకే ఒక్క రోజున రూ. 649.84కోట్లు విడుదల చేసింది. ఈ నిధుల చెల్లింపుల ద్వారా 2లక్షల 49వేల 406 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది.

వడ్ల పైసలు రూ.13833కోట్లు చెల్లింపులు
ఈ వానాకాలం సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లపై సర్కారు రెండు రోజుల్లోనే నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. శుక్రవారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 59.74లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. దీనికి గాను ఇప్పటి వరకు రూ.13833కోట్లు సివిల్ సప్లయ్స్ డిపార్ట్మెంట్ రైతులకు చెల్లింపులు చేసింది. రైఉలు ధాన్యం విక్రయించిన వెంట వెంటనే మిల్లులకు తరలించడంతో పాటు వారి బ్యాంకు ఖాతాల్లో నిధులను జమ చేస్తున్నామని సివిల్ సప్లయ్స్ కమిషనర్ స్టీఫీన్ రవీంద్ర వెల్లడించారు. సన్న వడ్లకు సంబంధించి శుక్రవారం ఒక్క రోజే రూ.649.84కోట్ల విలువైన 268 చెక్కులను 249406 మంది రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు. ధాన్యంకు సంబంధించిననిధులతో పాటు బోనస్ నిధులను వేగవంతంగా అందిస్తున్నట్లు వెల్లడించారు.

