
సహజ మరణానికీ రూ.10 లక్షల ఉచిత బీమా
హైదరాబాద్: సింగరేణి కార్మికులకు మరింత భద్రత కల్పించే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు అమలులో ఉన్న రూ.1 కోటి ప్రమాద బీమా పథకానికి తోడు, సహజ మరణం సంభవించినప్పటికీ రూ.10 లక్షల ఉచిత బీమా సౌకర్యాన్ని కల్పించాలని యూనియన్ బ్యాంక్ నిర్ణయించింది. ఈ పథకం ఈ నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది.
సింగరేణి యాజమాన్యం చేసిన సూచనల మేరకు, యూనియన్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాంకులో కార్పొరేట్ శాలరీ అకౌంట్ కలిగి ఉన్న కార్మికులు లేదా అధికారులు ఎవరైనా మరణించినట్లయితే, వారికి ఈ బీమా వర్తించనుంది.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చొరవతో 2024లో సింగరేణి కార్మికులకు రూ.1 కోటి ఉచిత ప్రమాద బీమా పథకాన్ని అమలు చేశారు. ఈ ఒప్పందానికి కొనసాగింపుగా సహజ మరణానికీ రూ.10 లక్షల బీమాను అందించాలనే నిర్ణయం తీసుకోవడం విశేషం.
సింగరేణి సంస్థ ఛైర్మన్ & ఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి ఆదేశాల మేరకు, డైరెక్టర్ (పర్సనల్ & ఫైనాన్స్) గౌతమ్ పోట్రు ప్రత్యేక చొరవ తీసుకోవడంతో ఈ పథకం అమలులోకి వచ్చింది.
సాధారణంగా ఇతర బీమా సంస్థల్లో రూ.10 లక్షల పాలసీ పొందాలంటే నెలకు కనీసం రూ.5 వేలకుపైగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అయితే సింగరేణి యాజమాన్యం చర్యల వల్ల కార్మికులు ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా ఈ సౌకర్యం పొందనున్నారు.
ఈ నిర్ణయంపై సింగరేణి కార్మికుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇదే విధంగా ఇతర బ్యాంకులు కూడా సహజ మరణ బీమా సౌకర్యాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని యాజమాన్యం ప్రయత్నాలు కొనసాగిస్తోంది.
