
యూఎల్సీ లే అవుట్లలో ఖాళీ ప్లాట్లపై చర్యలు లేవు
రహదారులు, పార్కుల పరిరక్షణపై హైడ్రా స్పష్టం
హైదరాబాద్, ఏప్రిల్ 04: యూఎల్సీ (అర్బన్ ల్యాండ్ సీలింగ్) భూముల్లో ఏర్పడిన పాత లే అవుట్లలో ఉన్న ఇళ్లతో పాటు ఖాళీ ప్లాట్లపైనా ఎలాంటి చర్యలు తీసుకోబోమని హైడ్రా స్పష్టం చేసింది. శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడిస్తూ, రెగ్యులరైజ్ కాని ఖాళీ ప్లాట్ల విషయంలో ప్రజలు అపోహలకు గురికావద్దని సూచించింది.
యూఎల్సీ భూముల్లోని లే అవుట్లలో ఖాళీగా ఉన్న ప్లాట్లను హైడ్రా పేరుతో ఆక్రమించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని హెచ్చరించిన అధికారులు, అలాంటి ప్రచారాలను నమ్మవద్దని నగరవాసులకు విజ్ఞప్తి చేశారు. ఏవైనా సందేహాలుంటే నేరుగా హైడ్రా కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
లే అవుట్ ప్రణాళిక ప్రకారం రహదారులు, పార్కులు, ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలాలను మాత్రమే హైడ్రా కాపాడుతుందని స్పష్టం చేసింది. 2024 జూలై 19న హైడ్రా ఏర్పాటు కంటే ముందు నిర్మాణాలు ఉన్న నివాసాలను కూల్చివేయబోమని ఇప్పటికే పలుమార్లు వెల్లడించిన విషయాన్ని మరోసారి గుర్తుచేసింది.
ఇటీవల శేరిలింగంపల్లి మండలం కొండాపూర్ గ్రామంలోని రాజరాజేశ్వరి నగర్, ఓయూ కాలనీ, రాఘవేంద్ర కాలనీలలో పార్కులు, రహదారులు, ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలాలపై ఉన్న ఆక్రమణలను మాత్రమే తొలగించినట్లు తెలిపింది. అలాగే కూకట్పల్లి మండలం హైదర్నగర్లోని గోపాల్నగర్ లే అవుట్లో పార్కును కూడా రక్షించినట్లు పేర్కొంది.
యూఎల్సీ భూముల్లోని రెగ్యులరైజ్ కాని ప్లాట్లను హైడ్రా స్వాధీనం చేసుకుంటుందని కొందరు చేస్తున్న ప్రచారం అసత్యమని, తక్కువ ధరకు స్థలాలు సొంతం చేసుకోవాలనే కుట్రగా భావించాలని ప్రజలకు సూచించింది.
