
హైదరాబాద్, జూన్ 26
రాష్ట్రంలో ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (Special Intensive Revision – SIR) కార్యక్రమం తొలి రోజున బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామ్చందర్రావు గన్ఫౌండ్రీ ప్రాంతంలో జరుగుతున్న ప్రక్రియను పరిశీలించారు. ఆయనతో పాటు బీజేపీ రాష్ట్ర ఎంఎల్సీ, మల్క కొమరయ్య, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎస్ఐఆర్ రాష్ట్ర కన్వీనర్ వేముల అశోక్ ,బీజేపీ ఎస్ఐఆర్ రాష్ట్ర ప్రధాన బృంద సభ్యుడు, బీజేపీ ఓబీసీ మోర్చా నేషనల్ మెంబర్ పెరిక సురేష్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అధికారులు చేపడుతున్న ఓటరు జాబితా సవరణ కార్యక్రమం, బూత్ లెవల్ అధికారుల (బీఎల్వోలు) ద్వారా ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, ఓటర్ల వివరాల సేకరణ తదితర అంశాలను నాయకులు పరిశీలించారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు పెరిక సురేష్ మాట్లాడుతూ, ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన ప్రక్రియ అని పేర్కొన్నారు. అర్హత కలిగిన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా, అనర్హుల పేర్లు తొలగించేలా ఎన్నికల సంఘం చేపడుతున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.

బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు అందజేస్తున్న నేపథ్యంలో ప్రజలు సరైన వివరాలను అందించి ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు. ఖచ్చితమైన ఓటరు జాబితా ద్వారానే ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని, “సరైన ఓటరు జాబితా – బలమైన ప్రజాస్వామ్యం.. ప్రతి ఓటరు ముఖ్యం.. ప్రతి ఓటు విలువైనదే” అనే సందేశంతో ప్రజలు చైతన్యవంతంగా భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.
