
కరెంటు వాడకంలో ప్రయోజనం కోసం టిఒడి
2020 విద్యుత్ నిబంధనలను సవరించిన కేంద్రం
టైమ్ ఆఫ్ డే (టిఒడి) టారిఫ్
స్మార్ట్ మీటరింగ్ నియమాలు సరళీకృతం
సోలార్ అవర్స్లో పవర్ టారిఫ్ 20% తక్కువ
పీక్ అవర్స్లో 10%-20% ఎక్కువ
కరెంటు వాడకంలో ప్రయోజనం కోసం టిఒడి
హైదరాబాద్, జూన్ 23:
టైమ్ను బట్టి కరెంటు వాడకంలో ప్రయోజనం కోసం కల్పించేందుకు కేంద్రం ఛార్జీల నియమ నిబంధనల్లో కొత్తగా మార్పులు తీసుకువచ్చింది. ప్రస్తుత విద్యుత్ టారిఫ్ వ్యవస్థకు రెండు మార్పులను చేసినట్లు కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ ప్రకటించింది. గత 2020 విద్యుత్ నిబంధనల్లో టైమ్ ఆఫ్ డే (టిఒడి) టారిఫ్, స్మార్ట్ మీటరింగ్ నిబంధనలను సవరించినట్లు వెల్లడించింది. డిమాండ్ను బట్టి కరెంటును వాడే వీలుగా ఈ కొత్త నిబంధన టైమ్ ఆఫ్ డే (టీఓడీ) టారిఫ్ సిస్టమ్ తీసుకొస్తున్నది. ఈ సిస్టమ్ ద్వారా పొద్దున పూట కరెంటు వాడే వినియోగదారులకు విద్యుత్ ఛార్జీలు 20 శాతం వరకు బిల్లు తగ్గనుంది. అదేవిధంగా డిమాండ్ ఎక్కువగా ఉండే రాత్రి వేళల్లో విద్యుత్ కరెంటు వాడితో ఛార్జీలు సాధారణం కంటే 10 నుంచి 20 శాతం మేర పెరుగుతాయని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ వెల్లడించారు. వినియోగదారులు ఏ సమయంలో ఎంత కరెంటు వాడుతున్నారనేది స్మార్ట్ మీటర్లతో గుర్తించి దానికి ప్రకారం కరెంటు బిల్లులు ఇవ్వనున్నారు. స్మార్ట్ మీటర్ వినియోగదారులకు కొత్త టారిఫ్ త్వరలో అమలులోకి రానుంది.

వచ్చే రెండేళ్లలో అందరికీ అమలు..
తాజాగా ప్రకటించిన విద్యుత్ నిబంధనలు వచ్చే రెండేళ్లలో అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నిబంధనల ప్రకారం 10 కిలోవాట్, అంతకంటే ఎక్కువ డిమాండ్ ఉన్న కమర్షియల్ , ఇండస్ట్రియల్ విద్యుత్ వినియోగదారులకు సంస్థలకు ఏప్రిల్ 1, 2024 నుంచి అమల్లోకి రానుంది. వ్యవసాయ వినియోగదారులకు ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఉంుటంది. ఇతర వినియోగదారులకు ఏప్రిల్ 1, 2025 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయని కేంద్ర విద్యుత్ శాఖ వెల్లడించింది.
డిమాండ్ తక్కువ ఉన్న టైమ్ లో కరెంటు వాడుకుంటే తక్కువే….
విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉన్న టైమ్లో ఎక్కువ కరెంటును వాడుకునేలా ఈ కొత్త విధానం ద్వారా వినియోగదారులను ప్రోత్సహించనున్నారు. ఫలితంగా గ్రిడ్లపై భారం తగ్గించవచ్చని కేంద్రం భావిస్తోంది. ఉదయం వేళ సోలార్ పవర్ అందుబాటులో ఉండనున్న నేపథ్యంలో దాని ధర తక్కువ కరెంటు ఎక్కువ అందుబాటులో ఉంటుంది. అందుకే ఉదయం వేళలను సోలార్ అవర్స్గా పేర్కొంటూ ఆ టైమ్లో కరెంటు వాడుకునే కస్టమర్లకు విద్యుత్ ఛార్జీలు తక్కువ వసూలు చేస్తున్నారు. రాత్రి వేళ హైడ్రో, థర్మల్ తదితర విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. వీటి నిర్వహణ ఖరీదు తో కూడుకున్నది. ఈ నేపథ్యంలో రాత్రి వేళల్లో విద్యుత్ ఛార్జీల ధరలు పెంచాలని కేంద్రం నిర్ణయించింది.దీంతో కరెంటు వాడకం సోలార్ అవర్స్కు మార్చుకునే వినియోగదారులకు లబ్ధి చేకూరునుంది.

రానున్న రోజుల్లో పెరుగనున్న డిమాండ్
గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో వాతావరణంలో మార్పుల కారణంగా ఈ వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో దేశవ్యాప్తంగా కరెంటు వాడకం గణనీయంగా పెరిగింది. రాబోయే నాలుగేళ్లలో వినియోగం రెట్టింపు అవుతుందని కేంద్రం విద్యుత్ మంత్రిత్వశాఖ అంచనా వేసింది. దేశవ్యాప్తంగా మార్చి 2022 నాటికి డిమాండ్ నాలుగు శాతం ఉండగా… మార్చి 2027 నాటికి ఇది సుమారు 7.2 శాతానికి చేరుకుంటుందని కేంద్రం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో కొత్త విద్యుత్ ఛార్జీల నియమాలు అమలు చేయడం ద్వారా గ్రిడ్లపై భారాన్ని తగ్గించవచ్చని భావిస్తోంది.
స్మార్ట్ మీటర్లకు ప్రోత్సహం..
దేశవ్యాప్తంగా విద్యుత్ ఖచ్చితత్వాన్ని లెక్కించేందుకు స్మార్ట్ మీటర్ విధానాన్ని అమలు చేస్తున్నారు. తాజాగా స్మార్ట్ మీటర్ నిబంధనల్లోనూ మార్పులు చేసినట్లు విద్యుత్ శాఖ వెల్లడించింది. స్మార్ట్ మీటర్ ఇన్స్టాల్ చేసిన నాటి నుంచి దానికి ముందు వరకు వినియోగించిన కరెంటుపై ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని పేర్కొంది. స్మార్ట్ మీటర్ వినియోగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ఈ నిబంధనలు అమలు చేస్తున్నట్లు విద్యుత్ మంత్రిత్వశాఖ వెల్లడించింది. గతంలో స్మార్ట్ మీటర్ ఇన్స్టాల్ చేసిన నాటి కంటే ముందు వరకు ఉపయోగించిన కరెంట్పై జరిమానా రూపంలో అదనపు ఛార్జీలు విధించేవారు. ఇకపై ఆ నిబంధనను తొలగించినట్లు కేంద్ర విద్యుత్ శాఖ వెల్లడించింది.
