
– కాలినడక దారిలో ఘటన
– బాలుడికి తీవ్ర గాయాలు
–చిరుతను వెంబడించి భయపెట్టిన స్థానికులు, తల్లిదండ్రులు
- వదిలివెళ్లిపోయిన చిరుత
- బాలుడికి ఆసుపత్రిలో చికిత్స
- తప్పిన ప్రాణాపాయం
తిరుమల, జూన్ 23
తిరుమల-అలిపిరి నడక దారిలో గురువారం జరిగిన చిరుత దాడిలో ఓ నాలుగేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడిన సంఘటన సంచలనం సృష్టించింది. స్థానికులు వెంటనే స్పందించడంతో బాలుడికి తృటిలో ప్రాణాపాయం తప్పింది.
కర్నూలు జిల్లా అదోనికి చెందిన దంపతులు తమ కుమారుడు కౌశిక్(4)ను తీసుకుని గురువారం రాత్రి నడక దారిలో తిరుమలకు బయలుదేరారు. ఆ తరువాత మొదటి ఘాట్ రోడ్డులోని ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం వద్ద భోజనం కోసం ఆగారు. బాలుడు పక్కనే ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో వెనక నుంచి బాలుడు వద్దకు వచ్చిన ఓ చిరుత బాలుడిని నోట కరుచుకుని అడవిలోకి లాక్కెళ్లి పోయింది.

దీంతో స్థానికులు, భద్రతాసిబ్బంది, తల్లిదండ్రులు పెద్దపెట్టున కేకలు వేస్తూ చిరుతను వెంబడించారు. టార్చిలైట్లు వేస్తూ, రాళ్లు రువ్వుతూ, పెద్ద పెట్టున కేకలు వేస్తూ చిరుతను బెదర గొట్టారు. దీంతో హడలి పోయిన చిరుత బాలుడిని వదిలేసి పారి పోయింది. తీవ్రంగా గాయపడ్డ బాలుడిని హుటాహుటిన పద్మావతి హాస్పిటల్ కు తరలించారు. బాలుడి చెవి వెనుక భాగం, తలపై పలు చోట్ల గాయాలు కాగా డాక్టర్లు చికిత్స అందించారు. ఎలాంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.