
పార్లమెంట్ ఎన్నికల్లో పవర్ ఇంజనీర్స్ అభ్యర్థిని పరిశీలించాలి
ఎఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు ఏఐపీఈఎఫ్ లేఖ
హైదరాబాద్, ఫిబ్రవరి 28
తెలంగాణలో జరిగే పార్లమెంట్ ఎలక్షన్లలో పవర్ ఇంజనీర్స్ అభ్యర్థిని పరిశీలించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లి కార్జున ఖర్గేకు అల్ ఇండియా పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్(ఏఐపీఈఎఫ్) లేఖ రాసింది. ఈమేరకు దేశంలోని విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణపై, విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకించినందుకు కాంగ్రెస్ పార్టీకి అసోసియేషన్ ఆల్ ఇండియా చైర్మన్ శైలేంద్ర దూబే ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో పవర్ ఇంజనీర్స్కు లోక్సభ అభ్యర్థిత్వం పరిశీలించాలని కోరారు. స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్గా సేవలందిస్తున్న పరికి సదానందంకు వరంగల్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించాలని ఖర్గేను కోరారు. దేశవ్యాప్తంగా లక్ష మంది ఇంజనీర్లతో 50 ఏళ్ల క్రితం ఏఐపీఈఎఫ్ ఏర్పాటైందనీ, విద్యుత్ సంస్థలు అభివృద్ధికి, ఇంజనీర్లు, వినియోగదారుల సమస్యలను పరిరక్షించేందుకు కీలకంగా పనిచేస్తుందని గుర్తు చేశారు.
ఏఐపీఈఎఫ్ అంతర్భాగమైన తెలంగాణ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ సదానందం గత 20 ఏళ్లుగా వివిధ హోదాల్లో, ఆరేళ్లు వరంగల్ లోక్ సభ పరిధిలో పనిచేశారనీ తెలిపారు. ఎస్సీల్లో బలమైన సామాజిక వర్గానికి చెందిన వక్తిగా అన్ని వర్గాల మద్దతు ఉందని పేర్కొన్నారు. లోక్సభ పరిధి లో విద్యుత్ ఇంజినీర్లు, ఉద్యోగులు, పెన్షనర్లకు, సింగరేణి, ఆర్టీసీ, రెవిన్యూ డిపార్ట్మెంట్ల సపోర్ట్తో పాటు అన్ని వర్గాల మద్దతు ఉందని, సదానందంను అభ్యర్థిగా రంగంలోకి దిగితే విజయం సాధ్యమవుతుందని తన లెటర్లో పేర్కొన్నారు.

