
తరుణ్ ఛుగ్ సమక్షంలో బీజేపీలో చేరిన రాములు
బీఆర్ఎస్ మునిగిపోయిన పడవ: తరుణ్ ఛుగ్
మోదీ పని తీరు చూసి బీజేపీలో చేరా: రాములు
న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 29
లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. నాగర్ కర్నూల్ ఎంపీ రాములు బీజేపీలో చేరారు. గురువారం ఢిల్లీ లోని బీజేపీ జాతీయ కార్యాలయంలో రాములు ఆయన కుమారుడు కల్వకుర్తి జడ్పీటీసీ మెంబర్ భరత్ తో కలిసి బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జీ తరుణ్ ఛుగ్, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమక్షంలో బీజేపీలో చేరారు.
ఈ సందర్భంగా తరుణ్ ఛుగ్ మాట్లాడుతూ… ఎంపీ రాములు మచ్చలేని మనిషి అని కొనియాడారు. బీఆర్ఎస్ పార్టీది ముగిసిపోయిన అధ్యాయమని… అదొక మునిగిపోయిన పడవ అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నియంతృత్వ పోకడలను భరించలేకే ఆ పార్టీని ప్రజలు ఓడించారని అన్నారు. రాములు సేవలు బీజేపీకి ఎంతో అవసరమని చెప్పారు. గత పదేళ్లలో ప్రధాని మోదీ అమలు చేసిన సంక్షేమ పథకాలే బీజేపీని భారీ మెజార్టీతో గెలిపిస్తాయని అన్నారు.
రాములు మాట్లాడుతూ… సమాజం కోసం పని చేస్తున్న వారు ప్రతిరోజూ దేశంలో ఏదో ఒక ప్రాంతం నుంచి బీజేపీలో చేరుతూనే ఉన్నారని చెప్పారు. పేదరికానికి వ్యతిరేకంగా మోదీ యుద్ధం చేశారని కితాబునిచ్చారు. దేశ ఖ్యాతిని ప్రపంచం నలువైపులా విస్తరించిన వ్యక్తి మోదీ అని.. ఆయన పనితీరును చూసి బీజేపీలో చేరానని చెప్పారు.

ఈ సందర్భంగా ఎంపీ రాములతో పాటు డీసీసీబీ చైర్మన్ జక్కా రఘునందన్ రెడ్డి, వనపర్తి జడ్పీ చైర్మన్ లోక్నాథ్రెడ్డి, సర్పంచుల సంఘం మాజీ స్టేట్ ప్రెసిడెంట్ పురుషోత్తమ్ రెడ్డి పార్టీలో చేరారు. ఈకార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, ఓబీసీ మోర్చా నేషనల్ మెంబర్ పెరిక సురేష్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీ కే అరుణ, పొంగులేటి సుధాకర్రెడ్డి, తల్లోజు ఆచారి తదితరులు పాల్గొన్నారు.