దేశవ్యాప్తంగా ఉన్న పలు మెడికల్ కోర్సుల్లో ప్రవేశం పొందేందుకు జరిగే నీట్ యూజీ పరీక్ష మే 5 న జరగనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే ఈ పరీక్ష ఆప్ లైన్ విధానంలోనే జరుగుతుంది. పెన్ను పేపర్ ద్వారానే నీట్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. మద్యాహ్నం 2 గంటల నుండి 5.20 గంటల వరకు జరగబోయే ఈ పరీక్షకు విద్యార్థులు అన్ని నియమాలు పాటిస్తూ, పరీక్షా కేంద్రానికి ఒక గంట ముందే రావాలని అధికారులు సూచిస్తున్నారు.
ఆదివారం నీట్ పరీక్ష జరుగుతున్న నేపథ్యంలో మాల్ ప్రాక్టీస్ జరగకుండా Nta కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. ఎగ్జామ్ ప్రారంభమైన మొదటి గంట అదే విధంగా ఎగ్జామ్ ముగుస్తుంది అనగా చివరి అర్థగంట కనీసం వాష్ రూమ్ కు కూడా అనుమతించొద్దని నిర్ణయం తీసుకుంది. ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థులు సరికొత్త టెక్నాలజీ గాడ్జెట్స్ ఉపయోగించి మాల్ ప్రాక్టీస్ చేయకుండా అడ్డుకునేందుకు ఈ రూల్స్ లో మార్పు తీసుకొచ్చినట్టు తెలిసింది.
రాష్ట్రం నుంచి 80 వేల మంది విద్యార్థులు నీట్ పరీక్షను రాస్తున్నట్టు తెలుస్తోంది. గత ఏడాది 70 వేల మంది ఈ పరీక్షలు రాశారు ఈసారి మరో 10 వేల మంది అదనంగా నీట్ పరీక్ష రాస్తున్నట్టు NTA వర్గాలు వెల్లడించాయి.
మే 5న జరగనున్న నీట్ పరీక్ష తెలుగుతో పాటు 13 భాషల్లో నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షకు దేశం నలుమూలల నుంచి 18 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరు కానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లు గానే విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా 499 పట్టణాలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రానికి ఒక గంట ముందే చేరుకుని రూమ్ వివరాలు అన్ని చెక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
కొన్ని పట్టణాలలో ఒకే పేరు మీద డిగ్రీ, పీజీ లాంటి కాలేజీలు చాలా ఉంటాయి. కాబట్టి ఒకటికి రెండుసార్లు పరీక్షా కేంద్రాన్ని చెక్ చేసుకోవాలి. 1.15 కల్లా పరీక్షా కేంద్రం దగ్గరకు చేరుకోవాలి. 1.30 గంటల తరవాత విద్యార్థులను హాల్ లోకి అనుమతించరు. 1.45కి బుక్ లెట్ పేపర్లు ఇస్తారు. 1.50 నుంచి 2 గంటల వరకు విద్యార్థుల వివరాలు బుక్ లెట్ లో నింపాల్సి ఉంటుంది. 2 గంటలకి ప్రశ్నపత్రాన్ని ఇవ్వటంతో పరీక్షా మొదలవుతుంది. విద్యార్థులు కంగారు పడకుండా పరీక్షా కేంద్రానికి ఒక గంట ముందుగా తీసుకురావాల్సిన బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలి.
నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు నియమాలు పక్కాగా పాటించాల్సిందే. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు అడ్మిట్ కార్డుతో పాటు ఒక పాస్ సైజ్ ఫోటో తీసుకెళ్లాలి. నీట్ పరీక్షకు డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించాలి. పొడవాటి దుస్తులు, షూస్ లాంటివాటిని అనుమతించరు. కేవలం స్లిప్పర్, శాండిల్స్ లాంటి మాత్రమే ధరించాలి. పేపర్లు, ప్లాస్టిక్ వాచీలు, పెన్ డ్రైవ్స్, వాలెట్లు, హ్యాండ్ బ్యాగ్, బ్లూటూత్, మొబైల్, స్మార్ట్ వాచ్ లాంటి వాటికి పర్మిషన్ లేదు. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ లాంటి వస్తువులకు అనుమతించరు. పరీక్ష రాసే విద్యార్థులకు హాలులోనే బాల్ పాయింట్ పెన్నును అందిస్తారు. ఈ నియమాలను పక్కాగా పాటించాల్సిందేనని అధికారులు సూచిస్తున్నారు.
భారతదేశంతో పాటు విదేశాల్లోని మెడికల్ కోర్సుల్లో ప్రవేశం పొందాలంటే నీట్ పరీక్ష తప్పనిసరి. నీట్ పరీక్ష పాస్ అయిన విద్యార్థులకు MBBS, BAMS, BSMS నర్సింగ్ లాంటి కోర్సుల్లో అడ్మిషన్ దొరుకుతుంది. మే 5న జరిగే నీట్ పరీక్ష ఫలితాలు 2024 జూన్ 14 వెలువడనున్నాయి. అదే నెలల్లోనే జూన్ 2వ వారం తర్వాత ముంచి కౌన్సెలింగ్ ప్రారంభం అవుతుందని అధికారులు చెబుతున్నారు.