
ముంబై ఎయిర్పోర్టులో మహిళ అరెస్ట్
ముంబై, నవంబర్ 1:ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు భారీ డ్రగ్ రవాణా ప్రయత్నాన్ని భగ్నం చేశారు. కొలంబో నుంచి ముంబైకి వచ్చిన ఓ మహిళ వద్ద నుంచి సుమారు 4.7 కిలోల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మత్తు పదార్థం విలువ సుమారు రూ.47 కోట్లుగా అంచనా.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, నిర్దిష్ట సమాచారంపై ఆ మహిళ లగేజీని తనిఖీ చేయగా, కాఫీ ప్యాకెట్లలో దాచిన 9 పౌచ్ల్లో కొకైన్ బయటపడింది. చాకచక్యంగా ఆహార పదార్థాల ముసుగులో డ్రగ్స్ను దాచిపెట్టినట్లు గుర్తించారు.
వెంటనే ఆ మహిళను అదుపులోకి తీసుకున్న డీఆర్ఐ, ఆమెతో సంబంధం ఉన్న మరో వ్యక్తిని ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ చేసింది. విచారణలో ఈ రాకెట్ వెనుక ఫైనాన్స్, లాజిస్టిక్స్ సహకారం అందిస్తున్న మరో ముగ్గురి పేర్లు బయటపడడంతో వారినీ అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఐదుగురిపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (NDPS) చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.
డీఆర్ఐ అధికారులు వెల్లడించినట్టు, ఇటీవల అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలు భారతీయ మహిళలను కొరియర్లుగా వాడుకుంటూ, కాఫీ, మసాలా, చాక్లెట్ ప్యాకెట్లలో డ్రగ్స్ను దాచిపెట్టి రవాణా చేస్తున్నట్లు సమాచారం లభించింది.
గత నెలలో కూడా ఢిల్లీలో డీఆర్ఐ భారీ ఆపరేషన్ నిర్వహించి 26 మంది విదేశీయులను అరెస్ట్ చేసి, రూ.108.81 కోట్ల విలువైన హెరాయిన్, కొకైన్, యాంఫెటమైన్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు గుర్తుచేశారు. ఈ స్మగ్లింగ్ వెనుక ఉన్న అంతర్జాతీయ డ్రగ్ నెట్వర్క్పై లోతైన దర్యాప్తు కొనసాగుతున్నట్లు డీఆర్ఐ స్పష్టం చేసింది.
