
దేశభక్తి వెల్లువ..
అంబేడ్కర్ విగ్రహం నుంచి స్వామి వివేకానంద విగ్రహం వరకు ఘనంగా తిరంగా యాత్ర
హైదరాబాద్, ఆగస్టు 14:
దేశభక్తి, జాతీయ సమైక్యత, అఖండ భారత స్ఫూర్తిని చాటుతూ హైదరాబాద్ ట్యాంక్బండ్పై శుక్రవారం ఘనంగా ‘తిరంగా యాత్ర’ నిర్వహించారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో నిర్వహించిన ఈ యాత్రలో జాతీయ జెండాలు చేతబూని పెద్ద సంఖ్యలో ప్రజలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రముఖులు పాల్గొని దేశభక్తి నినాదాలతో హోరెత్తించారు.


ట్యాంక్ బండ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ప్రారంభమైన తిరంగా యాత్ర స్వామి వివేకానంద విగ్రహం వరకు సాగింది. మార్గమంతా త్రివర్ణ పతాకాలు రెపరెపలాడగా.. ‘భారత్ మాతాకీ జై’, ‘వందేమాతరం’ వంటి నినాదాలతో పరిసర ప్రాంతాలు మార్మోగాయి. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ సమగ్రత, సార్వభౌమత్వం, జాతీయ ఐక్యతను కాపాడుకోవాలనే సందేశాన్ని యాత్ర ద్వారా చాటారు.
ట్యాంక్బండ్పై సాగిన తిరంగా యాత్రలో కనిపించిన దృశ్యాలు జాతీయ భావనకు ప్రతీకగా నిలిచాయి. చేతుల్లో త్రివర్ణ పతాకాలు.. నోట దేశభక్తి నినాదాలు.. భారత మాతపై అభిమానాన్ని చాటే సందేశాలతో పాల్గొన్న ప్రజలు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు మరింత శోభ తీసుకొచ్చారు.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్రావు, కేంద్ర మంత్రి జి. కిషన్రెడ్డి, బండి సంజయ్కుమార్, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కే లక్ష్మణ్ తదితర ప్రముఖ నాయకులు యాత్రలో పాల్గొన్నారు. సినీ రంగానికి చెందిన సాయికుమార్, మంచు మనోజ్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్తో పాటు పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, వివిధ రంగాలకు చెందిన విశిష్ట అతిథులు పాల్గొని కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఓబీసీ మోర్చా జాతీయ సభ్యుడు పెరిక సురేష్ తదితరులు తిరంగా యాత్రలో పాల్గొన్నారు.

జాతీయ పతాకాన్ని ప్రతి ఇంటిపై ఎగురవేయడంతో పాటు స్వాతంత్ర్య దినోత్సవాన్ని దేశభక్తి, ఐక్యతా స్ఫూర్తితో జరుపుకోవాలని సురేష్ పిలుపునిచ్చారు. యువతలో స్వాతంత్ర్య పోరాట చరిత్ర, జాతీయ పతాక ప్రాధాన్యం, దేశ ఐక్యతపై అవగాహన పెంచడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని సురేష్ పేర్కొన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం, జాతీయ సమైక్యత వంటి రాజ్యాంగ విలువలను పరిరక్షిస్తూ ‘ఏక్ భారత్–శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు
ఇటీవల తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్రావు ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తిని చాటాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

