
#రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ
#వానాకాలంలో 70.82 లక్షల టన్నుల ధాన్యం సేకరించిన రాష్ట్ర సర్కారు
#ఇది రాష్ట్ర చరిత్రలో అత్యధికం
#ఉమ్మడి రాష్ట్రంలోనూ సేకరణను అధిగమించిన తెలంగాణ
#ఇప్పటి వరకు 70.20 లక్షల టన్నులే అత్యధికం
#సంక్రాంతికి సన్న ధాన్యం బోనస్ రూ.500 కోట్లు విడుదల
#దీంతో 1425.91 కోట్లకు చేరిన బోనస్
హైదరాబాద్, జనవరి 12
రాష్ట్ర సర్కారు రికార్డు స్థాయిలో వానాకాలం ధాన్యం సేకరించింది. రాష్ట్ర చరిత్రలో అత్యధికంగా వానాకాలంలో 70.82లక్షల టన్నుల ధాన్యం సేకరించి ఆల్టైం రికార్డు సృష్టించింది. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇంత పెద్ద మొత్తంలో ధాన్యం సేకరణ జరగలేదు. ఇప్పటి వరకు ధాన్యం సేకరణ 70.21 లక్షల టన్నులే అత్యధికం కావడం గమనార్హం. ఈయేడు వానాకాలంలో గత 25ఏళ్ల ధాన్యం సేకరణలో రికార్డులను బద్దలుకొట్టి సరికొత్త రికార్డును సృష్టించింది. లాస్ట్ ఇయర్ ఇదే టైంకు 52.75లక్షల టన్నుల ధాన్యం సేకరించగా ఈయేడు ఇప్పటి వరకు 18.07లక్షల టన్నుల వడ్లు అధికంగా కొనుగోళ్లు చేసింది.

ధాన్యం రూ.16606కోట్ల చెల్లింపులు
అక్టోబర్ 1వ తేదీ నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. వడ్ల కొనుగోళ్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా వడ్ల కొనుగోళ్ల కోసం ప్రభుత్వం రికార్డు సంఖ్యలో 8448కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించి అన్ని సెంటర్లలో కొనుగోళ్లు చేశారు. సోమవారం నాటికి 13.97లక్షల మంది రైతుల నుంచి ఇప్పటి వరకు కొనుగోలు చేసిన 70.82లక్షల టన్నుల వడ్లలో 38.37లక్షల టన్నుల సన్నవడ్లు ఉండగా మరో 32.45 లక్షల టన్నులు దొడ్డువి ఉన్నాయి. కాగా, వడ్లు అమ్మిన రైతులకు ప్రభుత్వం వెంటనే చెల్లింపులు చేస్తున్నది. ఇప్పటి వరకు కొనుగోలు చేసి రూ.16,912కోట్ల విలువైన ధాన్యంకు సంబంధించి రూ.16,606కోట్లను రైతుల ఖాతాల్లో 98శాతం జమచేసింది. రాష్ట్రంలో ముందస్థుగా సాగైన జిల్లాల్లో ఇప్పటికే కొనుగోళ్లు పూర్తి కాగా 7265 సెంటర్లు 86శాతం క్లోజ్ చేసింది. ఇంకో ఒకటి రెండు టన్నుల ధాన్యం కొనుగోళ్లు మాత్రమే వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొనుగోళ్లు చేసిన ధాన్యాన్ని వెంట వెంటనే మిల్లులకు తరలిస్తుట్లు సివిల్ సప్లయ్స్ అధికారులు తెలిపారు.

ధాన్యం సేకరణలో ఆల్టైం రికార్డు
మద్దతు ధరతో ధాన్యం సేకరణ గత 2000=01 సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభమైంది. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక 2014 నుంచి ధాన్యం సేకరణను పరిశీలిస్తే గత 2021 వానాకాలంలో 70.21లక్షల టన్నులే ఇప్పటి వరకు అత్యధికంగా ధాన్యం సేకరణగా రికార్డు ఉంది. కాగా ఈయేడు ఇప్పటికే 70.82లక్షల టన్నుల ధాన్యం సేకరించి ఆల్టైం రికార్డు సృష్టించింది. ఇది గత 25ఏళ్లలో ఇదే రికార్డు కావడం గమనార్హం.
గత పదేళ్లుగా వానాకాలంలో రాష్ట్రంలో సేకరించిన ధాన్యం వివరాలు ఇలా..
2014–15 : 11.04
2015–16 : 15.13
2016–17 : 16.52
2017–18 : 18.27
2018–19 : 40.43
2019–20 : 47.09
2020–21 : 48.75
2021–22 : 70.21
2022–23 : 65.02
2023–24: 47.34
2024–25 : 53.95
2025–26 : 70.82


సంక్రాంతికి రైతులకు అందిన సన్నవడ్ల బోనస్
రాష్ట్ర సర్కారు సంక్రాంతికి సన్న వడ్ల అమ్ముకున్న రైతులకు సోమవారం రోజున బోనస్ రూ.500కోట్లు విడుదల చేసింది. దీంతో ఇప్పటి వరకు రూ.1425.91కోట్లు రైతుల బ్యాంకు ఖాతాలకు చేరాయి. రాష్ట్ర సర్కారు సన్నవడ్లకు మద్దతు ధరకు అధనంగా క్వింటాల్కు రూ.500 చొప్పున అందిస్తోంది. మద్దతు ధర రూ.2,389 ఉండగా రూ.500 అధనంగా తోడవడంతో రాష్ట్ర రైతులకు రూ.2889 చొప్పున రైతులకు గిట్టుబాటు జరిగింది. సంక్రాంతి పండుగకు ముందు రోజే రూ.500కోట్లు విడుదల చేయడంతో పండుగకు పైసలు అందడంతో రాష్ట్ర రైతాంగంలో హర్షం వ్యక్తమవుతోంది.
