
68.90 లక్షల మందికి రైతు భరోసా జమ
- 57.45 లక్షల ఎకరాలకు పెట్టుబడి సాయం
- నేడు బ్యాంకు ఖాతాల్లోకి నిధుల జమ
- మరో 45 రోజుల్లో రెండు విడతల్లో మిగతా రూ.5,400 కోట్లు
హైదరాబాద్, మార్చి 23:
రాష్ట్రంలోని రైతులకు ప్రభుత్వం పెద్ద ఎత్తున రైతు భరోసా నిధులను విడుదల చేసింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదివారం నర్మెట్టలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో తొలి విడత రైతు భరోసా నిధులను విడుదల చేశారు. మొత్తం 68,89,955 మంది రైతులకు రూ.3,446.94 కోట్లను విడుదల చేసినట్లు ప్రకటించారు.
ఈ నిధులు రాష్ట్రవ్యాప్తంగా 57,44,907 ఎకరాల 19 గుంటల భూములకు వర్తించనున్నాయి. ఎకరం వరకు భూమి కలిగిన రైతులందరికీ ఈ సాయం అందుతుంది. ఆదివారం బ్యాంకులకు సెలవు కావడంతో సోమవారం రైతుల బ్యాంకు ఖాతాల్లోకి ఈ మొత్తాన్ని జమ చేయనున్నారు.
ప్రభుత్వం ప్రకటించిన మేరకు ఎకరానికి సంవత్సరానికి రూ.12,000 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తుండగా, యాసంగి సీజన్కు సంబంధించి ఎకరానికి రూ.6,000 చొప్పున రైతులకు జమ అవుతోంది. మిగతా రూ.5,400 కోట్లను వచ్చే 45 రోజుల్లో మరో రెండు విడతల్లో విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

నల్గొండ జిల్లా టాప్లో
రైతు భరోసా నిధుల పంపిణీలో నల్గొండ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 5,22,313 మంది రైతుల ఖాతాల్లో రూ.268.57 కోట్లు జమ కానున్నాయి.

తదుపరి స్థానాల్లో ఖమ్మం జిల్లాలో 3.35 లక్షల మంది రైతులకు రూ.169.51 కోట్లు, సంగారెడ్డి జిల్లాలో 3.53 లక్షల మందికి రూ.167.80 కోట్లు, నాగర్కర్నూల్ జిల్లాలో 3.01 లక్షల మందికి రూ.157.95 కోట్లు, సిద్ధిపేట జిల్లాలో 3.53 లక్షల మందికి రూ.153.44 కోట్లు జమ చేయనున్నారు.

అత్యల్పంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో రూ.10.43 కోట్లు మాత్రమే జమ కానున్నాయి.
రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్ర రైతులకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిధులను దశలవారీగా విడుదల చేస్తోంది.

