
దేశానికి సమగ్ర దళిత అజెండా ఇవ్వడమే లక్ష్యం
ఈనెల 26 27 తేదీల్లో హరిత ప్లాజాలో
26 రాష్ట్రాల నుంచి 80 సంఘాల భాగస్వామ్యం
కూలీ బంధు ప్రకటించాలి
వెల్లడించిన మల్లేపల్లి, బీ వెంకట్
హైదరాబాద్, ఆగస్టు 22
దేశానికి సమగ్ర దళిత అజెండాను ఇవ్వడమే లక్ష్యంగా ఈనెల 26, 27 తేదీల్లో హైదరాబాద్ బేగంపేటలోని హరితప్లాజాలో నేషనల్ దళిత్ సమ్మిట్ నిర్వహిస్తున్నట్టు పలు సంఘాలు ప్రకటించాయి. మంగళవారం హరిత ప్లాజాలో జరిగిన మీడియా సమావేశంలో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ అధ్యక్షులు మల్లేపల్లి లక్ష్మయ్య, ఆల్ ఇండియా అగ్రికల్చర్ వర్కర్స్ యూనియన్ జాతీయ ప్రధాన కార్యదర్శి బీ వెంకట్ సమ్మిట్ వివరాలను మీడియాకు వెల్లడించారు.
ఈ జాతీయ సదస్సులో 26 రాష్ట్రాల 80 విభిన్న సంఘాలకు చెందిన 300 మంది ప్రతినిధులు భాగస్వామ్యం అవుతారని తెలిపారు. 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో ఇన్నాళ్లు దళితులను ఓటుబ్యాంకుగా చూశారే తప్ప స్వావలంబన, సాధికారితకు చేయలేదని విమర్శించారు. రాజకీయాలకు అతీతంగా ఈ సదస్సు జరుగుతుందని తెలిపారు. భూమి, ఉద్యోగాలు, పరిశ్రమలు సహా అన్నింటా దళితులు తగిన వాటాను ఖచ్చితంగా కోరతామని తెలిపారు. ఈ అజెండా దేశ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేసేలా ఉంటుందని స్పష్టం చేశారు.
దళితులకు అన్యాయం…
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గడచిన పదేండ్లలో దళితులపై దాడులు, అత్యాచారాలు, వివక్ష పెరిగాయనీ, ఆపార్టీ మేనిఫెస్టోలో కనీసం దళితులకు స్థానం లేదని అన్నారు. దళిత విద్యార్థుల ఉన్నత చదువులకోసం ఉద్దేశించిన రాజీవ్ గాంధీ ఫెలోషిప్ వంటి పథకాల్లో కోతలు విధించారని చెప్పారు. ఎస్సీ ఫైనాన్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ నిధులు, – స్కాలార్షీప్ల్లోనూ కోతలు విధించారని గుర్తుచేశారు. దళితుల అజెండాను దేశం ముందు పెట్టేందుకే తాము ఈ ప్రయత్నం చేస్తున్నామని వివరించారు.
కూలీ బంధు ప్రకటించాలి…
అసంఘటితరంగంలో పనిచేస్తున్న వారిలో 60 శాతం మంది దళితులే ఉన్నారని అన్నారు. భూమి ఉన్న రైతులకు రైతు బంధు, పీఎం కిసాన్ ఇస్తున్న ప్రభుత్వాలు భూమి లేని పేదలు, కూలీల కోసం కూలీ బంధు ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను బీ వెంకట్ డిమాండ్ చేశారు.
హాజరు కానున్న ప్రముఖులు..
రెండు రోజుల ఈ జాతీయ సదస్సులో యూజీసీ మాజీ చైర్మెన్ సుఖాదియో థోరట్, హర్యానా కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి రాజశేఖర్ ఉండ్రు, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి వంటి పలువురు ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. ఆహ్వాన సంఘం ప్రతినిధులుగా మాజీ ఐఎఎస్ అధికారి కాకి మాధవరావు, మల్లేపల్లి లక్ష్మయ్య, జాన్ వెస్లీ, బాలమల్లేష్ రాధికా మీనన్ వ్యవహరిస్తారని పేర్కొన్నారు. 26, 27 తేదీల్లో జరిగే జాతీయ సదస్సులో చేసే డిక్లరేషన్ పై అన్ని రాష్ట్రాల్లోనూ సమావేశాలు జరుగుతాయనీ, నవంబర్ లో జాతీయ స్థాయి సమావేశం ఢిల్లీలో జరుగుతుందని వివరించారు.
ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ. స్కై లాబ్ బాబు, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్ అనీల్ కుమార్, ఆలిండియా ఆగ్రికల్చర్ రూరల్ వర్కర్స్ అండ్ లేబర్ అసోసియేషన్ ప్రతినిధి సాయి బాలాజీ, భారత్ ఖేత్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కాంతయ్య తదితరులు పాల్గొని ప్రసంగించారు.