
హైదరాబాద్, మే 16:
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇచ్చిన ఆర్థిక స్వావలంబన, ఇంధన పొదుపు, బాధ్యతాయుత వనరుల వినియోగ పిలుపుకు మద్దతుగా బీజేపీ ఓబీసీ మోర్చా సోషల్ మీడియా నేషనల్ మెంబర్ పెరిక సురేష్ ఎలక్ట్రిక్ స్కూటర్పై ప్రయాణిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.
ఈ సందర్భంగా పెరిక సురేష్ హిమాయత్నగర్ నుంచి నారాయణగూడ మార్కెట్ వరకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంపై ప్రయాణించారు. నారాయణగూడ చౌరస్తాలో వేసవి తాపంతో అల్లాడుతున్న ప్రజలకు మజ్జిగ ప్యాకెట్లను అందించారు. ప్రజా బాధ్యత, క్రమశిక్షణతో కూడిన నాయకత్వానికి ఆయన ఆదర్శంగా నిలిచారని పార్టీ నాయకులు పేర్కొన్నారు. కారులో ప్రయాణించకుండా ప్రజా రవాణా, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం ద్వారా ఇంధన పొదుపు, ఆర్థిక ఆదా, స్థిరమైన రవాణా విధానాల పట్ల తన నిబద్ధతను చాటిచెప్పారని తెలిపారు. దేశ ప్రజలు అనవసర ఇంధన వినియోగాన్ని తగ్గించాలని, బాధ్యతాయుత జీవన విధానాలను అలవర్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుకు అనుగుణంగానే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పెరిక సురేష్ వెల్లడించారు.
భవిష్యత్తులో ప్రపంచ ఆర్థిక మాంద్యం పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పెట్రోల్, డీజిల్, వంటనూనెల వినియోగాన్ని తగ్గించడంతో పాటు, వచ్చే ఏడాది వరకు బంగారం కొనుగోళ్లను తగ్గించాలని ప్రధాని మోదీ సూచించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఇలా చేయడం ద్వారా దేశ సంపద విదేశీ మార్కెట్లకు వెళ్లకుండా నిలువరించి, భారత ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయవచ్చని పేర్కొన్నారు.

ప్రధాని మోదీ సందేశాన్ని ప్రతి ఒక్కరికీ చేరవేయాలనే ఉద్దేశంతో తాను ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని ఉపయోగిస్తూ వీధులు, కూడళ్లు, మార్కెట్లలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ ప్రజల నుంచి ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని చెప్పారు. బీజేపీ కార్యకర్తగా పార్టీ సిద్ధాంతాలు, కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తున్నానని పెరిక సురేష్ తెలిపారు. తెలంగాణ ప్రజలు జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రజా రవాణాను వినియోగించడం, పెట్రోలియం ఉత్పత్తులు, వంటనూనెలు, బంగారం కొనుగోళ్లను తగ్గించాలని ఆయన విజ్ఞప్తి చేశారు
