
రూ.14లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేత
ముగ్గురు వ్యక్తుల ముఠా అరెస్ట్
డ్రగ్స్, వాహనాలు సీజ్
హైదరాబాద్, సెప్టెంబరు 11
డ్రగ్స్ దందాలో ఇప్పటిదాకా నైజీరియన్లు, మగవాళ్లు పట్టుబడడం చూశాం. కానీ, తాజాగా ఓ యువతి మాదకద్రవ్యాల వ్యాపారం చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికింది. హైదరాబాద్ నగరంలోని మోకిలలో పోలీసులకు భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఈ సందర్భంగా పోలీసులు దాదాపు 52 గ్రాముల కోకైన్, 45 ఎల్ఎస్డీ పిల్స్, 8 గ్రాముల హెరాయిన్ ను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు సీజ్ చేశారు.
పట్టిపడింది ఇలా..
డ్రగ్స్ కేసుకు సంబంధించి రాజేంద్రనగర్ డీసీపీ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి కీలక వివరాలు మీడియాకు వెల్లడించారు. మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ కు సంబంధించి సమాచారం రావడంతో రైడ్ చేసి ముగ్గురు ముఠాను, డ్రగ్స్ పట్టుకున్నారు. డ్రగ్స్ కేసులో కరీంనగర్ కు చెందిన అనురాధ (34)అనే యువతి కీలకంగా ఉందని పోలసుల విచారణలో తేలింది. వివాహిత అయిన అనురాధ భర్త నుంచి విడాకులు తీసుకుని విడిగా హైదరాబాద్ లోని గచ్చిభౌలి టీఎన్జీవోస్ కాలనీ ఉంటోంది. డ్రగ్స్ కు బానిసైన అనురాధ తరచూ గోవాకు వెళ్తూ అక్కడ కొకైన్, ఏండీఎంఏ మాత్రలు కొనుగోలు చేసి వినియోంచేది. ఈక్రమంలో గోవాలో నైజీరియాకు చెందిన జేమ్స్ పరిచయం ఏర్పడింది. అనురాధ జేమ్స్ వద్ద డ్రగ్స్ కొనుక్కొని రోడ్డు మార్గంలో హైదరాబాద్కు తీసుకువచ్చినట్లు పోలీసులు తెలిపారు.
గోవాలో జేమ్స్ వద్ద గ్రాముకు రూ.10 వేలు చొప్పున డ్రగ్స్ కొనుగోలు చేసి, నగరానికి తీసుకువచ్చి డిమాండ్ ను బట్టి గ్రాము రూ.20 వేలకు పైగా విక్రయించేది. డ్రగ్స్ అమ్మకంలో వరలక్ష్మి టిఫిన్స్ అధినేత ప్రభాకర్ రెడ్డి అనురాధకు సహకరించినట్లు పోలీసులు చెప్పారు. ప్రభాకర్ రెడ్డి డ్రగ్ కన్జ్యూమర్ గా ఉంటూ పెడ్లర్ గా మారాడని తెలిపారు.

అదే విధంగా ఏపీలోని గుంటూరుకు చెందిన శివ అనే వ్యక్తి అనూరాధకు డ్రగ్ అమ్మకంలో సహకరించారని పోలీసులు గుర్తంచారు.శివ కన్జ్యూమర్ ఉంటూ పెడ్లర్ గా మారి అనురాధకు సహకరించినట్లు విచారణలో తేలింది. ఈ ముగ్గురిని కస్టడీలోకి తీసుకుని, వారు వినియోగించిన మూడు వాహనాలు సీజ్ చేసారు. వారి ఫోన్లు స్వాదీనం చేసుకుని, వారి కస్టమర్లకు సంబంధించి వివరాలను పొలీసులు ఆరా తీస్తున్నారు. డ్రగ్ సరఫరా ముఠాను రిమాండ్ చేసి తిరిగి కస్టడీలోకి తీసుకుని, వారి నెట్ వర్క్ పై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని అధికారులు వెల్లడించారు.

డ్రగ్స్ స్వాధీనం..
మోకిల వద్ద డ్రగ్స్ అమ్ముతుండగా ఎస్ఓటీ టీమ్ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా అనూరాధను పట్టుకున్నారు. ఆమెతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద పోలీసులు వీరిపై కేసు నమోదు చేశారు. వారి నుంచి 48 గ్రాముల ఎండీఎంఏ, మరొక 8 గ్రాముల క్రషింగ్ ఎండీఎంఏ, 51 గ్రాముల కొకైన్ సీజ్ చేశారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ.14 లక్షల వరకు ఉంటుందని డీసీపీ జగదీశ్వర్ రెడ్డి వెల్లడించారు.
