
గ్రీనరీకీ ప్రాధాన్యత ఇవ్వాలిః మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఫిబ్రవరీ 5వరకు నెక్లెస్రోడ్లో షో
హైదరాబాద్, ఫిబ్రవరి 01
గ్రీనరీకి ప్రాధాన్యత ఇస్తూ భవిష్యత్ తరాలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా లో ఏర్పాటు చేసిన 15వ గ్రాండ్ నర్సరీ మేళా ను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని అన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో లభించే అనేక రకాల మొక్కలు ఒకే చోట లభించే విధంగా ఆల్ ఇండియా హార్టీకల్చర్ పేరుతో గ్రాండ్ నర్సరీ మేళాను గత పదేళ్లుగా కంటిన్యూగా ఏర్పాటు చేయడం పట్ల నిర్వాహకులను ఆయన అభినందించారు. దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లోని నర్సరీల్లో పెరిగిన మొక్కలు, మెడిసినల్ ప్లాంట్లు, ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ప్రజల ఇష్టాలకు అనుగుణంగా కిచెన్ గార్డెన్, వర్టికల్ గార్డెన్, టెర్రస్ గార్డెన్ను హ్యాబీగా చేసుకుని చిన్న పాటీ గార్డెన్ ఏర్పాటు చేసుకుంటే ఆక్సీజన్తో పాటు వర్క్ ప్రెజర్ తగ్గి మానసిక ఉత్సాహాన్ని పొందగలుగుతామని అన్నారు. పచ్చదనం కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. నగర వాసులకు మొక్కల పెంపకం చక్కటి ఆరోగ్యాన్ని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పొందేందుకు తోడ్పాటును అందిస్తాయన్నారు. నేడు మొక్కలను నాటడం భవిష్యత్ తరాలకు మేలు చేసిన వారం అవుతామని చెప్పారు. మొక్కల పెంపకాన్ని ఉద్యమంగా చేపట్టాలని సూచించారు.

ఫిబ్రవరి 5 వరకు నర్సరీ మేళా..
మేళా ఇంచార్జీ ఖాలీద్ అహ్మద్ మాట్లాడుతూ ఫిబ్రవరి 5 వరకు ఉదయం 9గంటల నుంచి రాత్రి 9గంటల వరకు గ్రాండ్ నర్సరీ మేళా జరుగుతుందని తెలిపారు. థాయ్ల్యాండ్ వంటి విదేశాల తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి 160కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. స్టాల్స్లో అరుదైన మొక్కలు, విత్తనాలు, ఎరువులు, పరికరాలు ప్రదర్శన, విక్రయాలు జరుగుతాయన్నారు. పూలు, పండ్లు, గార్డెనింగ్ లాంటి మొక్కలు అందుబాటులో ఉన్నాయని, అన్ని ఒకే చోట దొరుకుతాయన్నారు. నగర వాసులకు ఇదో మంచి అవకాశమని, హోంగార్డెన్, టెర్రస్ గార్డెన్, వర్టికల్ గార్డెన్, కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలనుకునే వారికి ఇదో మంచివేదిక అన్నారు. నర్సరీలతో మేలు జాతి మొక్కలు, అంటుకట్టిన మొక్కలు అందుబాటులోకి తెచ్చామని ఖాలీద్ అహ్మద్ వివరించారు.
