
కీలక బిల్లులు, విపక్షాల దాడితో హోరాహోరీ పోరు!
నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. అధికార-విపక్షాల మధ్య ఢీ అంటే ఢీ..!
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 13 వరకు మొత్తం 19 సమావేశాలు జరగనున్న ఈ సెషన్లో కేంద్ర ప్రభుత్వం పలు కీలక బిల్లులను సభ ముందుకు తీసుకురానుండగా, విపక్షాలు నీట్ ప్రశ్నాపత్రం లీక్, అయోధ్య రామాలయ విరాళాల అక్రమాల ఆరోపణలు, ఇథనాల్ బ్లెండింగ్ విధానం, పార్టీ ఫిరాయింపులు, జమ్మూకశ్మీర్ రాష్ట్ర హోదా వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని వ్యూహరచన చేశాయి. దీంతో ఈ సమావేశాలు రాజకీయంగా అత్యంత ఉత్కంఠభరితంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సమావేశాలు ప్రారంభానికి ముందు ఆదివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలోనే అధికార, విపక్షాల మధ్య వాగ్వాదాలకు బీజం పడింది. సభను సజావుగా నడిపేందుకు అన్ని పార్టీలు సహకరించాలని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కోరగా, ప్రజా సమస్యలు, వివాదాస్పద అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని విపక్షాలు స్పష్టం చేశాయి.

8 కీలక బిల్లులకు కేంద్రం సిద్ధం
ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఎనిమిది కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. తొలి రోజే రెండు ప్రధాన బిల్లులు సభల ముందుకు రానున్నాయి.
రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ‘వందేమాతరం’ జాతీయ గేయాన్ని అవమానించడాన్ని శిక్షార్హ నేరంగా ప్రకటించే బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లు ప్రకారం జాతీయ గేయాన్ని ఉద్దేశపూర్వకంగా అవమానిస్తే గరిష్ఠంగా మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది.
లోక్సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టనున్నారు. న్యాయ వ్యవస్థలో పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించడమే దీని ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం చెబుతోంది.
అదే సమయంలో విదేశీ విరాళాల నియంత్రణ (FCRA) సవరణ బిల్లు, వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ (VBSA) బిల్లు, ఆదాయపు పన్ను సవరణ బిల్లు, ఎంఎస్ఎంఈ అభివృద్ధి సవరణ బిల్లు వంటి చట్టాలకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వనుంది.
డీలిమిటేషన్ బిల్లుపై ఆసక్తి
ఈ సమావేశాల్లో అత్యంత చర్చనీయాంశంగా మారే అంశం డీలిమిటేషన్ బిల్లుగా భావిస్తున్నారు. ఈ బిల్లును చివరి వారంలో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనికి అవసరమైన రెండు మూడొంతుల మెజారిటీ సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం మిత్రపక్షాలు, ఇతర ప్రాంతీయ పార్టీలతో సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ బిల్లుపై విస్తృత స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరిపిన తర్వాతే ముందుకు రావాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
విపక్షాల దూకుడు
పార్లమెంట్ సమావేశాల తొలి రోజే రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఇండియా కూటమి నేతలు సమావేశమై ఉమ్మడి వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు. నీట్ పేపర్ లీక్, అయోధ్య రామాలయ విరాళాల అక్రమాల ఆరోపణలు, ఇథనాల్ బ్లెండింగ్ విధానం, పార్టీ ఫిరాయింపులు, జమ్మూకశ్మీర్ రాష్ట్ర హోదా, విద్యార్థుల సమస్యలు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి.
ప్రధాని మోదీ ప్రసంగం
పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు ఉదయం 10 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడి సమావేశాల ప్రాధాన్యత, ప్రభుత్వ శాసన కార్యక్రమాలపై తన అభిప్రాయాన్ని వెల్లడించనున్నారు. అభివృద్ధి, సంస్కరణలు, ఆర్థిక వృద్ధి, న్యాయ వ్యవస్థ బలోపేతం వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించనున్నట్లు సంకేతాలు ఉన్నాయి.
భారీ భద్రత
పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించారు. జంతర్ మంతర్ వద్ద జమ్మూకశ్మీర్కు రాష్ట్ర హోదా కోరుతూ నేషనల్ కాన్ఫరెన్స్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరగనుండగా, పలు విద్యార్థి, సామాజిక సంస్థల ఆందోళనలకు కూడా పోలీసులు అప్రమత్తమయ్యారు.
సభపై సర్వత్రా ఆసక్తి
కీలక బిల్లులు, రాజ్యాంగ సవరణల అవకాశాలు, ప్రతిపక్షాల దూకుడు, రాజకీయంగా సున్నితమైన అంశాలపై చర్చల నేపథ్యంలో ఈసారి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు దేశవ్యాప్తంగా తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అధికార, విపక్షాల మధ్య వాడీవేడిగా చర్చలు జరిగే అవకాశాలు ఉండటంతో ఈ సమావేశాలపై రాజకీయ వర్గాల దృష్టి కేంద్రీకృతమైంది.
