హైదరాబాద్, జూన్ 21: కొత్తగా పట్టాపాస్ బుక్ వచ్చిర రైతులకు ఈయేడు వానాకాలం రైతుబంధుకు అవకాశం కల్పించారు. జూన్ 16 నాటికి పాస్ బుక్ వచ్చిన ప్రతి రైతుకు రైతుబంధు పెట్టుబడి సాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్తగా పట్టాదారు పాస్ బుక్ , ఆధార్ , బ్యాంకు ఖాతా పుస్తకం జిరాక్సు కాపీలను స్థానిక ఏఈవోలకు అందజేయాల్సి ఉంటుంది. బుధవారం నుంచే ఏఈవో కు రైతుబంధు పోర్టల్లో ఎడిట్ ఆప్షన్ అందుబాటులో తెచ్చారు.

సీసీఎల్ఏ డేటా ఆధారంగా రైతుల గుర్తింపు..
సీసీఎల్ఏ డేటా ఆధారంగా రైతులను గుర్తిస్తారు. రైతు పట్టా పాస్బుక్ వివరాలను రైతుబంధు పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. రాష్ట్రంలో సీసీఎల్లో నమోదైన పట్టాదారు పాసుపుస్తకాలు కలిగిన 68.94లక్షలకు పైగా రైతులు రైతుబంధుకు అర్హులుగా ఉన్నట్లు తెలుస్తోంది. నిరుడు వానాకాలంలో కొత్త లబ్ధిదారుల నమోదుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొత్త వారికి ఛాన్స్ లేకుండా పోయింది. తాజాగా కొత్త లబ్ధిదారుల నమోదుకు అవకాశం కల్పించారు. గత 2022 జూన్ 5నుంచి 2023 జూన్ 16 వరకు జరిగిన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన డేటాను వ్యవసాయశాఖకు సీసీఎల తాజాగా అందించింది. ఈ డేటా ఆధారంగా ఏఈవోలు కొత్తగా రైతు బంధు లబ్దిదారులను ఎంపిక కోసం పోర్టల్లో ఎంట్రీచేయనున్నారు.

ఐదు రోజులే ఎంట్రీకి అవకాశం
ఈనెల 26నుంచే రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేస్తోంది. దీనికి మరో ఐదు రోజులు మాత్రమే గడువు ఉంది. దీంతో గత ఏడాది గా వచ్చిన కొత్త పాస్బుక్ ఎంట్రీలు చేయడానికి ఏఈవోలకు సమస్యగా మారింది. నెల రోజులుగా రైతుబంధుపై నిర్లక్ష్యంగా వ్యవహరించి కేవలం ఐదు రోజులు ఇవ్వడం పట్ల ఏఈవోలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒకవైపు రైతుబంధు నిధుల పంపిణీ జరుగుతున్నా , మరోవైపు లబ్ధిదారుల నమోదు ప్రక్రియ కొనసాగు తుందని , రైతులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని అగ్రికల్చర్ కమిషనరేట్ వర్గాలు తెలిపాయి . రోజుకో ఎకరం చొప్పున పెంచుతూ పది రోజులకు పైగా నగదు బదిలీచేసే అవకాశాలున్నాయి. ఇదేసమయంలో రైతుబంధు పోర్టల్లో కొత్త లబ్ధిదారులను నమోదుచేస్తారని చెబుతున్నారు .

మరో రెండు లక్షలమంది పెరిగే అవకాశం..
గత యాసంగిలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 63 లక్షల మంది రైతులల్లో పదెకరాలకు పైగా ఉన్న రైతులకు రైతుబంధు పథకం కింద నగదు బదిలీ చేయలేదు. అదే విధంగా యాసంగిలో కొత్తలబ్ధిదారులను నమోదు చేసుకోలేదు. అయితే ఈయేడు వానాకాలంలో భూయాజమాన్య హక్కుల మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించడంతో లబ్ధిదారుల సంఖ్య రెండు లక్షలకు పైగా పెరిగే అవకాశం ఉంది. దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసుకున్న రైతులకు ఈనెల 26 నుంచి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే వానాకాలం రైతుబంధు పెట్టుబడి సాయం అందనుంది.