
రాష్ట్రంలోని 17,227 మంది రేషన్ డీలర్లకు లబ్దీ
రేషన్ డీలర్ల 13 డిమాండ్లకు సర్కారు గ్రీన్ సిగ్నల్
ఏటా అధనంగా రూ.139కోట్లు కేటాయింపు
హైదరాబాద్, ఆగస్టు 08
రేషన్ డీలర్లకు కమీషన్ పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఇప్పుడు టన్నుకు రూ.900ల నుంచి రూ.1400లకుపెంచింది. మంగళవారం రేషన్ డీలర్లతో మంత్రులు హరీష్రావు, గంగుల కమలాకర్ జరిపిన చర్చలు ఫలించడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17,227మంది రేషన్ డీలర్లకు లబ్దీ చేకూరుతుంది. డీలర్ల కమిషన్ ను అదనంగా రూ.500 పెంచడం ద్వారా ప్రభుత్వంపై ఏటా రూ.139 కోట్లు అధనపు భారం పడుతుందని సివిల్ సప్లయ్స్ వర్గాలు చెబుతున్నాయి.

ప్రధాన డిమాండ్లకు పరిష్కారం….
కమిషన్ తో రేషన్ డీలర్లు అడుగుతున్న ప్రధానమైన 13 అంశాలను పరిష్కరించారు. ప్రధానంగా కరోనా సమయంలో సేవలందిస్తూ మరణించిన 100మంది డీలర్ల వారసులకు కారుణ్య నియామకం కింద డీలర్ షిప్లను మంజూరు, రాష్ట్రంలో అమలవుతున్న రైతు బీమా, నేత, గౌడ సమాజిక వర్గాలకు బీమా సౌకర్యం కల్పించిన తరహాలో రేషన్ డీలర్లకు రూ.5లక్షల బీమా అమలు చేయడానికి అంగీకారం తెలిపారు. ప్రతీ డీలర్ ను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడంతో పాటు ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద ఖచ్చితమైన తూకం వేసేలా వేబ్రిడ్జిల ఏర్పాటు చేయడానికి సర్కారు అంగీకరించింది. డీలర్ షిప్ రెన్యూవల్ 5 ఏళ్ల కాలపరిమితికి పెంచడం, రేషన్ డీలర్షిప్ వయోపరిమితిని 40 నుండి 50 ఏళ్లకు పెంచేందుకు అంగీకరించారు. రేషన్ డీలర్లు చనిపోతే వారి అంత్యక్రియల నిర్వహణకు తక్షణ సాయం రూ.10 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. అదే విధంగా 1.5 క్వింటాళ్ల వేరియేషన్ను కేసుల పరిధి నుండి తీసివేయడం, హైదరాబాద్ లో రేషన్ భవన్ నిర్మాణానికి భూకేటాయింపు తదితర 13 అంశాలపై సర్కారు సానుకూలత వ్యక్తం చేసింది.
డీలర్లతో మంత్రుల సుధీర్ఘ చర్చలు
సెక్రటేరియట్లో మంగళవారం రేషన్ డీలర్ల సంఘం జేఏసీ ప్రతినిధులతో రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చర్చలు జరిపారు. ఈ చర్చల్లో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, రేషన్ డీలర్ల సంఘం గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మల్యే పద్మా దేవేందర్ రెడ్డి డీలర్ల జేఏసీ నేతల సమక్షంలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా అన్ని అంశాలను కూలంకశంగా చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రులు హరీష్రావు,గంగుల కమలాకర్ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు కేవలం టన్నుకు రూ.200 మాత్రమే ఉండేదని ప్రస్థుతం దానిని రూ.1400 పెంచామన్నారు. అతి తక్కువ సమయంలో 700 శాతం కమిషన్ పెంచిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. దేశంలోని ఏరాష్ట్రంలోనూ కేంద్ర ప్రభుత్వ కోటాకు అధనంగా ఇవ్వడం లేదని, కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశ్యంతో రాష్ట్రంలోని 90.05 లక్షల కార్డుల్లో దాదాపు 35.56 లక్షల కార్డుల్లోని 91 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఒక్కొక్కరికి ఆరుకిలోల చొప్పున అందిస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కార్డులకు సైతం అధనంగా కిలోను కేటాయిస్తున్నామన్నారు. కమిషన్ సైతం కేంద్రం పెంచకున్నా రాష్ట్ర ప్రభుత్వం పెంచి అందిస్తుని మంత్రులు వివరించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు సివిల్ సప్లైస్ కమిషనర్ అనిల్ కుమార్, రేషన్ డీలర్ల జేఏసీ ప్రతినిధులు నాయికోటి రాజు, మల్లిఖార్జున్, రవీందర్, నాయక్ తదితరులు పాల్గొన్నారు.